ప్రముఖ సాహితీవేత్త ఆశావాది ప్రకాశరావు మృతి పట్ల పలువురి సంతాపం.. నేత్రదానం చేసిన ఆశావాది!

  • గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ప్రకాశరావు
  • 50కిపైగా పుస్తకాలు, 170కిపైగా అవధానాలు
  • 2021లో పద్మశ్రీ పురస్కారం
ప్రముఖ సాహితీవేత్త, కవి, అవధాని డాక్టర్ ఆశావాది ప్రకాశరావు కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. అనంతపురం జిల్లా పెనుకొండలోని స్వగృహంలో నిన్న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

ప్రకాశరావు తన 52 ఏళ్ల సాహితీ జీవితంలో 50కి పైగా పుస్తకాలు రాశారు. 170కి పైగా అవధానాలు చేశారు. ప్రకాశరావు సాహితీ సేవలకు గాను భారత ప్రభుత్వం 2021లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించి గౌరవించింది. రాష్ట్ర ప్రభుత్వం కళారత్న బిరుదుతో సత్కరించింది.

ప్రకాశరావు మృతి పట్ల రాజకీయ, సాహితీ ప్రముఖులు, పలువురు కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రకాశరావు తన నేత్రాలను ఇప్పటికే దానం చేసి ఉండడంతో సాయి ట్రస్టు నేతృత్వంలో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు ఆయన నేత్రాలను సేకరించి హైదరాబాద్ తరలించారు.

పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, మెరుపుతీగలు, చెల్లపిళ్లరాయ చరిత్రము, ఆర్కెస్ట్రా (వచన కవిత), విద్యా విభూషణ, ఘోషయాత్ర నాటకం, నారాయణ శతకము, శ్రీ రాప్తాటి పరిచయ పారిజాతము, సహయాచారి సాహితీ సాహచర్యము, ప్రహ్లాద చరిత్ర-ఎర్రన, పోతనల తులనాత్మక పరిశీలనతోపాటు అనువాద గ్రంథాలు, సుబోధినీ వ్యాకరణం వంటి రచనలు ప్రకాశరావుకు పేరు తెచ్చిపెట్టాయి.

Asavadi prakasa Rao
poet
Penukonda
Anantapur District

More Telugu News